అసహాయతా హాస్యాలు

పొద్దున్నే లేచింది ఇల్లాలు. లేదు లేదు, లేపింది పాపాయి.రాత్రి రెండు సార్లు ఏడిస్తే లేచి పాలు పట్టి పడుకోబెట్టింది. ఇప్పుడు ఇంకో గంటలో తెల్లవారుతుంటే ఇంకేం పడుకోగలనులే అని పక్క మీదినించి లేచి కిందికెళ్ళి పాపాయి కాలకృత్యాలు తీర్చింది. పాలు ఇచ్చి, కడిగిన గిన్నెలు తీసి సర్దింది. తనో కప్పుడు కాఫీ తాగే లోపు ఓ పది సార్లు పాప పిలిచింది. నవ్వుతూ పలకరించి ఆ బోసి నవ్వులు చూసుకుని సూర్యుడు తెల్లవారకుండానే ఉదయించాడనుకుంది.  అంతలోకే తూర్పు తెల్లవారింది. పాపను సముదాయిస్తూనే ఈమెయిల్సు చూసుకుని బడిలో ఆ రోజు తన వంతు క్లాసంతటికీ లంచి చెయ్యడం అని గుర్తొచ్చి, వచ్చే వారం ఇంకో పనికి రాగలవా అని అడిగిన టీచరుకి అవునని జవాబిచ్చి, ఇంకో కార్యక్రమాన్ని ఇంకొందరు తల్లులతో కో-ఆర్డినేటు చేసి, మరో సారి తనను వదిలేసి వెళ్ళినట్లు గట్టిగా అరిచి పిలుస్తున్న పాపాయిని కోపం నటిస్తూ పలకరించి, ఇంతలోకే కిందికి వచ్చిన అబ్బాయిలిద్దరికీ పాలిచ్చి పొద్దున టిఫిన్లూ, పిల్లల లంచ్‌లూ తయారు చెయ్యడం మొదలు పెట్టింది. 

 
శ్రీవారు కిందికి వచ్చారు. ఏమిటి, రాత్రి గిన్నెలు డిష్‌వాషరులో వెయ్యలేదా అంటూ శుభోదయం చెప్పారు. చివుక్కుమన్నా జవాబు చెప్పి లాభం లేదని, ఇంతలోకే పాపాయి మళ్ళీ పలకరిస్తే ఓ నవ్వు విసిరేసింది. నాలుగు సార్లు చెప్పాక ఐదో సారి వెళ్ళి బట్టలు వేసుకొచ్చిన పెద్దబ్బాయిని చూసి ఊపిరి పీల్చుకుందామనుకుంటే చొక్కా తిప్పేసి వేసుకున్నాడు. గట్టిగా వాడినో మాటనే సరికి చిన్న వాడు తను వేసుకున్న బట్టలు తీసేసి అన్నను మంచి పిల్లాడనిపించాడు. ఓ పది సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఓ వంద మనసులో లెక్క పెట్టుకుని, సరిగా తయారయ్యేంత వరకూ ఓపిక పట్టి, నయానా, భయానా టిఫిను తినిపించి, బ్యాగులు సర్ది, పాపాయికి వెచ్చటి బట్టలు వేసి, తానూ తయారయ్యి పిల్లల్ని బయల్దేరదీసింది. పెద్ద వాడిని స్కూలు బస్సు ఎక్కించి, చిన్న వాణ్ణి బడిలో దింపి ఇంటికి వచ్చే సరికి పాపాయి కారు సీటులో జోగుతూ ఉంటే, “అమ్మయ్య ఇప్పుడూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు” అనుకుంది. ఇంటికి వచ్చి కారు ఆపిందో లేదో, పాపాయి, “ఎక్కడికి పోయావు, నన్నొదిలేసి” అన్నట్టు ఏడుపు లంకించుకుంది. దొరుకుతుందనుకున్న కాస్త విశ్రాంతి కూడా గగనమయ్యేసరికి ఉసూరుమనిపించినా, పాపాయిని, “ఇక్కడే ఉన్నాను లెవే. అప్పుడే నిద్రైపోయిందా” అంటూ పలకరించి  లోపలికెళ్ళి పక్కన పడుకోబెట్టుకుని పాడుతూ, ఆడుతూ కాసేపు ఊపే సరికి మొత్తానికి శాంతించిన పాపాయి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయింది. 
ఫోను మోగే సరికి ఓ యుగమయ్యిందేమో అన్నట్టు ఉలిక్కిపడి లేచిన తల్లికి తీరా చూస్తే తను ఇంట్లోకి వచ్చి పావు గంటే అయిందని తెలిసింది. పాపాయిని జాగ్రత్తగా పడుకోబెట్టి, పరిగెత్తి వెళ్ళి ఫోనందుకుంది. తీరా ఫోనులో పిలిచింది ఓ టెలీమార్కెటరు. వీళ్ళకీ తెల్ల వారిందీ, అవసరం లేనివన్నీ అంటగట్టేందుకు, అందరి చేతా తిట్లు తినిపించుకోవడానికీను, అనుకుని నీరసంగా వంటింట్లోకి వెళ్తే గుర్తొచ్చింది, ఇంకా తనేమీ తినలేదని. ఏదో కాస్త తిన్నాననిపించి, పిల్లలు ఆ కాస్త సేపట్లో పోగు చేసిన చెత్తని శుభ్రం చేసి, సర్ది, ఇక మధ్యాహ్నం  బడికి పట్టికెళ్ళాల్సిన వంట తయారు చెయ్యడం మొదలు పెట్టింది.  కాసేపట్లో శ్రీవారి ఫోను. తను పొద్దున తిన్న దాంట్లో క్యాలరీలు లెక్కపెట్టి ఓ రెండు ఎక్కువయ్యాయి కనుక మధ్యాహ్నం జాగ్రత్తగా చూసి తినమని చెప్పి, పిల్లలని ఇంకో కార్యక్రమంలో చేర్పించేందుకు అత్యవసర ప్రయత్నాలు ఆరంభించమని పురమాయించి, వాళ్ళు తిన్న టిఫిన్లో పోషకాలు ఏం తక్కువయ్యాయో గుర్తు చేసి తన బాధ్యత నెరవేర్చుకుని ఫోను పెట్టేశారు.  
వంట చేసుకుని సర్దుకుని స్నేహితురాలిని పలకరిద్దామని ఫోను చేసే సరికి పాపాయి లేచి మళ్ళీ పిలిచింది.  పాపని ఆడిస్తూ మాట్లాడుతుంటే, స్నేహితురాలు, “నా తీరిక కాస్త నీకిద్దునే, ఇవ్వగలిగితే” అంది.  “ఏం చేసుకోను ఇంకొంచెం ఖాళీ సమయం, ఇంకొంచెం ఇంటి పని చేసుకునేందుకా, వద్దులే. ఒకటొకటే పనులైపోయి రాత్రి ఏడింటికి ఆటనుంచి పిల్లల్ని ఇంటికి తీసుకు వచ్చానంటే వాళ్ళా స్నానాలు, తిళ్ళూ చూసుకుని పక్క మీద వాలడం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకా సమయం దొరికితే ఆ మూల వాక్యూం చేసుకోవడమో, ఈ గది సర్దుకోవడమో, ఆ సామాన్లు తెచ్చుకోవడమో మరో సమయం దొరకక మిగిలిపోయిన పనో చేసుకోవల్సి ఉంటుందని కాని తీరికేదే” అంది. స్నేహితురాలు వినిపించుకోవడంలేదు. ఆమెకి తెలియంది కాదు. కాని మొదటి మాటలకే ఆమె నవ్వడం ప్రారంభించింది, అది ఆగట్లేదు. ఆ నవ్వులో ఏం దాగుందో? ఆనంద బాష్పాలు లాగే అసహాయతా హాస్యాలు.     

శ్లోకంతో ప్రయోగం

కేయూరా న భూషయంతి

ఈ శ్లోకం original ఎవరి దగ్గరైనా ఉంటే పంచుకోగలరు.

 

 

ప్రతి ఒక్కరికీ తమ కథ ఉంటుంది

ఈ రోజు మా పిల్లల బడిలో ఒక కథ విన్నాను.

Three little pigs కథ. బహుశా అందరికీ తెలిసిన కథ ఈ విధంగా ఉంటుంది.
ఒక మూడు పందులు ఇళ్ళు కట్టుకోవాలనుకుంటాయి.
మొదటి  పంది ఎండు గడ్డితో, రెండవది పుల్లలతో, మూడవది ఇటుకలతో కట్టుకుంటాయి.
ఒక తోడేలు ఈ పందులను తినాలనుకుంటుంది. మొదటి పంది ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది.
ఆ పంది రానివ్వనంటే ఇంటిని కూల్చేస్తుంది. ఆ పంది పరిగెత్తుకుంటూ రెండో పంది ఇంటికి వెళ్తే తోడేలు అక్కడికి వచ్చి అదీ కూల్చేస్తుంది. చివరికి మూడో పంది ఇంట్లో మూడు పందులూ చేరుతాయి.
తోడేలు కూడా అక్కడికి చేరుకుంటుంది. ఇటుకల ఇంటిని కూల్చలేక చిమ్నీలోంచి దూకి లోపలికి వెళ్ళి పందుల్ని తినేద్దామనుకుంటుంది. అప్పుడు తెలివైన మూడో పంది చిమ్నీ కింద మంట మీద పెద్ద గంగాళంలో నీళ్ళు పెడ్తుంది.  అందులో పడి తోడేలు వళ్ళు కాల్చుకుని ఎలాగో బయటపడి అడవిలోకి   పారిపోతుంది. మళ్ళీ కనిపించదు. పందులు ఇక ఎప్పుడూ సుఖంగా ఉంటాయి.

ఈ రోజు నేను విన్న కథ తోడేలు మాటల్లో:
“మీకు తెలిసిన కథ అబద్ధం. నేను చెప్తాను వినండి అసలేం జరిగిందో.
మా అవ్వ పుట్టిన రోజుకి నేను కేకు చేద్దామనుకున్నాను. ఇంట్ళో చక్కెర నిండుకుంది. నాకు అప్పుడు బాగా తుమ్ములూ దగ్గుతో జలుబు కూడాను. పొరుగున ఉన్న పందిని అడిగి ఎరువు తెచ్చుకుందామని వెళ్ళానా, అక్కడ నాకు గట్టిగా తుమ్మొచ్చింది. ఎవరైనా ఎండు గడ్డితో ఇల్లు కట్టుకుంటారా, అతి తెలివి కాకపోతే. ఆ ఇల్లు కాస్తా కూలిపోయింది! సరే రెండో ఇంటికి వెళ్ళానా, ఆ తలుపు కొడ్తుంటే అదీ కూలిపోయింది, పుల్లలతో ఇల్లు కట్టుకుంటే ఏమౌతుంది మరి? సరే ఇప్పటికీ నాకు చక్కెర దొరకలేదు. మూడో ఇంటికి వెళ్తే  ఆ ఇల్లు ఇటుకలతో కట్టిందేమో, ఈ సారి ఏ ప్రమాదమూ జరగలేదు. కాస్త చక్కెర బదులిస్తే మా అవ్వకి కేకు చేసిస్తాను అంటే, ఆ మూడో పందేమందో తెలుసా, మా అవ్వకు పళ్ళు లేవట. కేకు కూడా కొరకలేదుట. మరి నాకు కోపం రాదా?మర్యాద కోసమైనా తలుపు కూడా  తియ్యలేదు. కోపమొచ్చి, చిమ్నీలోంచి దూకి ఆ పందికి బుద్ధి చెప్దామనుకున్నాను. అక్కడ కాగుతున్న నీళ్ళలో పడి వళ్ళు కాల్చుకున్నాను. ఇళ్ళు కూలిపోవడం చూసిన రిపోర్టర్లు కథ రాసుకుందామని వచ్చి నా కథ అంత సంచలనాత్మకంగా లేదని మసాలాలు కలిపి ఇదిగో నేను కావాలాని ఇళ్ళను  గట్టిగా ఊది కూల్చేసినట్టు రాసి ప్రచురించారు!”

ఇక నా మాట:

ఐరావతిగారు యుగాంతా అని భారతాన్ని మొత్తమో, కొంచెమో గాంధారి మాటల్లో రాశారు. పొద్దులో వచ్చిన ఈ వ్యాసం చదివి ఆమె గురించి గూగులమ్మని అడిగితే దొరికిన కొన్ని భాగాలను చదివాను. అసలు పుస్తకం చదివుతానేమో ఎప్పటికైనా.
అలాగే ఒక సారి మా స్నేహితురాలు ఒక లంకె పంపించింది. అందులో సీతా దేవి తన పుట్టింటికి ఉత్తరాలు రాసినట్టూ, ముందు శ్రీరామ పట్టాభిషేక వార్త విని పట్టు చీరలు latest fashion వి అడిగినట్టూ, తర్వాత వన వాసం గురించి తెలిసి నార చీరలడిగినట్టూ ఇలా ఏదో హాస్యంగా రాశారు. 
అలాగే మహాభారతం దుర్యోధనుడి వైపు నించి చెప్పించినా, రామాయాణం ఊర్మిళ వైపునించి చెప్పించినా ఆసక్తి కరంగానూ, కొండోకచో వినోదంగానూ ఉంటుందనడంలో సందేహం లేదు.

అంతవరకూ పరవాలేదేమో? శ్రీనాథుడు పార్వతి చాలు గంగను విడువు అని చెప్పిన పద్యాన్ని వినోదంగానే  తీసుకుంటాము కదా.   

ఒక హద్దు దాటితేనే దాడిలాగా అనిపిస్తుంది. నాకనిపించేదేమంటే, నిజమైనా, కల్పనలైనా, రామాయణ మహాభారతాలు  అద్భుతమైన ఊహా శక్తికీ, సాహిత్యానికీ  నిదర్శనాలు. విలువలు నేర్చుకునే వారికి నేర్చుకున్నంత. అవి శాశనాలు అని, అందులో చెప్పినదే ధర్మం అనీ, ఆధర్మానికి తమ భాష్యాలు చెప్పడమూ, అలాగే అవి పూర్తిగా ఒక వర్గం వారికి ఉపయోగపడేందుకే రాశారనడమూ రెండూ ఆ కావ్యాలను దుర్వినియోగం చెయ్యడమే అనిపిస్తుంది నాకు.
ఇది ధర్మ శాస్త్రం అన్న వారూ చాలా మంది వాటిని అర్థం చేసుకోవడానికి తామే మధ్యవర్తులై తమ భాష్యాలే ultimate అన్నట్టు చేసి జన సామాన్యానికి దూరం చేశారు. అలాగే పూర్తి విరుద్ధంగా భాష్యాలు చెప్పే వారూ, ఇవి చాలా కల్మషంతో రాసినవి, చదవనక్కర్లేదు అని ధ్వనించేలా చెప్తుంటారు. ఇంతగా పోరాడి  అందరూ అన్నీ చదవచ్చు అన్న సమానతను సాధించినది ఇందుకా?
సైన్సైనా, సాహిత్యమైనా, ఆధ్యాత్మికతైనా ప్రతి ఒక్కరికీ ప్రతిదీ అర్థం కాదు. కాని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. వాటిని అర్థం చేసుకోగలిగే వారు, వాటిలో నిష్ణాతులైన వారు సాధారణ, సామాన్య జనానికి వాటిని ఎంత బాధ్యతాయుతంగా అందిస్తారు, అందించ గలరు, అందుకున్న వారు ఎంతవరకూ అర్థం చేసుకోగలరు, ఎంత అన్వయించుకోగలరు, ఎంత ఉపయోగించుకోగలరు అన్న దాని మీద సాఫల్యత శాతం ఆధారపడి ఉంటుంది.
వినేటప్పుడు “వినదగునెవ్వరు చెప్పిన…” అన్నది ఎంత ముఖ్యమో, చెప్పేటప్పుడు కూడా కాస్త బాధ్యతతో, వినే వారి తెలివితేటలకి, స్వంత భాష్యాలకి, వారి సందేహాలకి కాస్తంత చోటు ఉంచి చెప్పే వారు చెప్పాలేమో కదా అని నా అభిప్రాయ సారాంశం.

ఇక  పైన ఇలాంటి నా స్పందనలు ఆపేద్దామనుకున్నాను. ఈ రోజు ఆ కథ వింటే, అన్వయించాలనిపించింది.

సర్వధారి నామ ఉగాది శుభాకాంక్షలు

ప్రవాసం నుంచి పిలిచినా
కులాసాగా “కుహూ” మంటుంది కోయిలమ్మ
కుశలంగా మేమున్నామని
మావారందరికీ కబురు చేరుస్తుంది

పోయిన ఉగాదికి రాసుకున్నాను
మళ్ళీ నెమరు వేసుకుంటున్నాను
మసకగా ఉన్న మనోగతాన్ని
మరమ్మత్తు చేసుకుంటున్నాను

కాలంతో పోటీ పడను
కలిసి నడవడమే నా ధ్యేయం
కలిసి వచ్చిన వాటితోనే
కలలు నిజం కాగలవు.

 

మంచితనం, ఒంటరితనం

“అనిపిస్తుంటుందొక్కోసారి, మంచితనం కంటే ఒంటరితనం లేదు అని”

అని రాశాను ఒక టపాలో. అంతకు మించి ఇంకా రాయాలనిపించి ప్రయత్నం చేసినా అతకలేదు.
సరే, పై మాటకి ఎన్నో కోణాలు ఉన్నాయి నా మనసులోనే. అందులో ఒకటో రెండో స్పృశిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. 
“మంచితనం” అనే దానికి charm (Telugu equivalent తెలియచేయగలరు) లేదు.
కోటి మందిలో ఒక్కడైనా పూర్తి మంచి మనిషిగా ఉంటాడని చెప్పినా నమ్మకం కుదరదు.
కుదిరినా నిలవనియ్యరు ఎవరో ఒకరు. 

ఇప్పుడు కొన్ని బ్లాగులనూ, టపాలనూ ఉదహరిస్తున్నాను. దయ చేసి నాలో రేగిన భావాలను అర్థం చేసుకుంటారు కాని నేను ఎవరినీ దూషిస్తున్నట్టు అనుకోరని ఆశిస్తున్నాను.

http://naprapamcham.blogspot.com/2008/03/book-review-2-vivekananda.html
పై టపా చదివాక నాకు ఒక రకమైన వికారం కలిగింది.
గాంధీని అన్న వారూ, అంటున్న వారూ లేకపోలేదు.
నిజం అనేది దేవుడో, లేక ఆ బ్రహ్మ పదార్థమేంటో దానికి తప్ప ఎవరికీ తెలియదు.
ఇక ఇదే బ్లాగులో ఎందరో సాహిత్యకారుల గురించి రాస్తూ ఉంటారు, వారికి సంబంధించి కొన్ని చణుకులు కూడా రాస్తారు. దాదాపు పేరున్న ప్రతి సాతీవేత్తకూ ఏదో ఒక దుర్గుణం ఉండటం అనేది ఇంకా నాకు కొరుకుడు పడని విషయం. కొన్ని టపాలలలో ఉదహరించిన హాస్యాలని చూస్తే నాకు నిజంగానే తిప్పినట్టయ్యింది. 

ఇంకో ఉదాహరణ:
http://theuntoldhistory.blogspot.com/2008/04/blog-post_03.html
ఈ టపా ఇప్పటికి సరి కొత్తది. ఈ series లో ఈయన రాముడు పుట్టక ముందు భారతదేశంలోని పరిస్థితులని మొదలు పెట్టుకుని రామాయాణంలోని పలు ఘట్టాల గురించి, అవి ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టిన ఘోరమైన జీవన శైలి గురించి రాస్తున్నారు. నాకు తోచిన సందేహాలను, అభిప్రాయాలను, వ్యాఖ్యలుగా అక్కడ రాస్తూ వస్తున్నాను. నాకనిపించిన ప్రకారం ఆయన ముందే ఒక agenda ను ఎంచుకున్నారు. ఆ agenda కి అనుకూలంగా ఉన్న వాటన్నింటినీ ఏరి పోగు చేసి మనకు ఒక చిత్రాన్ని చూపిస్తున్నారు.

మళ్ళీ http://naprapamcham.blogspot.com/ లోనే వేరే మత గ్రంథాల పైన విమర్శనా పూర్వక విశ్లేషణతో కూడిన పుస్తకాలనూ పరిచయం చేశారు. దానికి ఆయా మతాల వారూ స్పందించారు.

అప్పుడొక సారి ఇలాంటి వాటి గురించి నాకనిపించిన భావాన్ని ఇక్కడ రాశాను.

రామాయణం ఒక అందమైన కావ్యం. హిందూ మతానికి ఏదైనా పునాది అంటూ ఉంటే అది వేదాలు, ఉపనిషత్తులలో ఉందని అనిపిస్తుంది. వాటి ఆధారంగా నడుస్తున్న సమాజంలో జరిగిన కథ, లేదా కల్పించిన కథ రామాయణం అనుకుంటే సరిపోతుంది కదా? చదివి విశ్లేషించుకోవచ్చు. పైన చెప్పిన బ్లాగులో లాగా చీల్చి చెండాడితే ఆ అందమైన కావ్యాన్ని చదవాలనిపిస్తుందా?

అంతెందుకు  షేక్స్పియరు నాటకాలు తీసుకోండి. అందులో యూదులని నీచంగా అవమానించడం చూపిస్తారు. కొన్ని నాటకాలలోని తిట్లు పరమ అసహ్యంగా ఉంటాయి.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే మంచితనం అని మనం అనుకునేది 100 శాతం మంచితనంగా మనకు అందదు. 100 శాతం మంచితనంగా ఉన్న మంచి తనం మనకు అందదు. 

ఇంకో కోణం ఏంటంటే, “నేను మంచి వాడిని (దాన్ని)” అనుకునే వారంత ఒంటరి వారు ప్రపంచంలో ఉండరనిపిస్తుంది. “నేను మంచి” అనుకోవడంలో “నేను బలైపోతున్నాను” అన్న అర్థం స్ఫురిస్తుంటుంది. లేదా, “నేను త్యాగం చేస్తున్నాను”, “నా లాగా మంచి వారు కాని వారిని నేను నా మంచితనం వల్ల భరిస్తున్నాను”, వంటి భావనలు స్ఫురిస్తాయి. నేను ఇది నా మనసులో నా గురించిన reflections లో నాకు కలిగిన భావాల గురించి చెప్తున్నాను. ఇంకొకరిని అనటం లేదు. నన్నూ తేలిక చేసుకోవడం లేదు.  అందువల్ల, “మంచితనం వల్ల” అని అనుకుని కలిసి ఉండడంలో ఆనందం లేదనిపించే,  శ్రీవిద్య గారి వ్యాఖ్యకు “నిజంగా?” అని సమాధానం చెప్పాను.

నాకు నచ్చిన మాట

Spiritual growth is “allowing that which is unconscious to become conscious.”

ఎలర్జీలు - తెలుసుకోవలసిన విషయాలు

http://www.foodallergy.org/anaphylaxis/index.html
పై లంకెలో చాలా సమాచారం ఉంటుంది. ఎలర్జీల వాసన అంటని వారు, మరీ ముఖ్యంగా అటువంటి వారే  చదివి తెలుసుకోవలసిన సమాచారం చాలా ఉంది. తప్పక చదవ గలరు. ఎందుకంటే, ఎలర్జీలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోగలుగుతారు, వారికి ఆ విధంగా సాయపడ గలుగుతారు. మీ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

http://anukuntaa.blogspot.com/2008/03/food-for-skin.html?showComment=1206676560000c8716297653017839714
ఇక్కడ మొదలైన సంభాషణతో నాకు ఈ విషయం మీద రాయాలన్న ఆలోచన వచ్చింది.

ముఖ్యమైన విషయాలు మున్ముందుగా.
ఎలర్జీలు అనేవి అపోహలు కాదు, నిజం.
తిండి వల్ల ప్రాణాంతకం కాగల reactions కూడా అవ్వచ్చు, కొన్ని కీటకాలు కుట్టినా కూడా.
తగు జాగ్రత్త, తక్షణ స్పందన అవసరం.
కొంతమందికి వారికి పడే పదార్థానికి పడని (పల్లీలో, పాలో) సోకినా కూడా అపాయకరమే.
ఏ పదార్థానికి ఎలర్జీలు ఉన్నాయో తెలుసుకోవడానికి రక్తం test చేసి తెలుసుకోవచ్చు.
కొంతమంది ఎక్కువ అదృష్టం ఉన్న వారికి ఒకటో రెండో తేలుతాయి. ఇంకొంతమందికి చాలా తేలుతాయి.
అయితే, postive వచ్చినంత మాత్రాన నిజంగా ఉన్నట్టు కూడా కాదు. antibody count, eosonophils count చూసుకుని డాక్టరుతో మాట్లాడి ఆ ఆహారం తినిపించి నిర్ధారించుకోవచ్చేమో తెల్సుకోవచ్చు.
ఎక్జిమా దాదాపు 30% కేసుల్లో మాత్రమే అనుకుంటా, ఎలర్జీల వల్ల వస్తుంది.
పుప్పొడి, దుమ్ము ఇలాంటి వాటి వల్ల సాధారణంగా మరీ ప్రమాదకరమైన ఎలర్జిక్ రియాక్షన్లు కలగవు.
ఆస్థ్మా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఆస్థ్మా చాలా మంది మన వాళ్ళు అనుకునేటట్లు చలికే కాదు, తీవ్రమైన వేడికి కూడా flare up అవుతుంది.
ముఖ్యంగా అమెరికాలో పుట్టిన పిల్లలు మన వారే అయినా కాస్త చల్లదనమే ఎక్కువ భరించగలుగుతారు, వేడికన్నా. జలుబు చేస్తుందని తెగ వేడిగా ఉంచేస్తుంటారు ఇంట్లో చాలా మంది. దాని వల్ల కూడా చర్మం మీద పొక్కులు, పిల్లలకు ఇబ్బంది, చిరాకు, తల్లులకు తోచకపోవడాలూను.

పాలు పడకపోవడం, గోధుమలు పడకపోవడం లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎలర్జీలు.
రెండు lactose intolerance (పాలకు), wheat gluten పడక పోవడం (గోధుమలకు).  

నా స్నేహితురాలికి నువ్వులు, పల్లీలు, వంకాయలు పడేవి కాదు.
మా అన్నయ్య స్నేహితుడికి పల్లీలు పడేవి కాదు. తింటే swelling మొదలయ్యేది.

మా స్నేహితురాలి విషయంలో lunch పంచుకునేటప్పుడు, ఇంటికి భోజనానికి వచ్చేటప్పుడు అర్థం చేసుకున్నా, నమ్మే దాన్ని కాదు. ఇష్టం లేక పోతే అలా అంటారులే అనుకునే దాన్ని. మా అన్నయ్య స్నేహితుడి విషయం మా పిల్లల ఎలర్జీ టెస్టుల విషయం ఇంట్లో చెప్తున్నప్పుడు బయటపడింది. 

దొరికిందల్లా చదివే అలవాటులో భాగంగా ఎలర్జీల గురించి పత్రికల్లో చదవడం జరిగింది. అప్పుడూ, అబ్బా ఇంటికి వచ్చే వారి గురించి ఇన్ని జాగ్రత్తలు అవసరమా అనిపించేది. మా పిల్లాడికి పుట్టిన కొత్తల్లోనే ఎక్జిమా మొదలైతే ఎలర్జీలేమో (అంటే పడక పోవడం అనే దానికి పర్యాయ పదంగా వాడతారు కదా మన వాళ్ళు) అంటే, తల్లి పాలలో ఎలర్జీలేముంటాయి అనుకుని పట్టించుకోలేదు. అప్పటికే చదివాను, తల్లి తినే ఆహారానికి కొంత మంది పిల్లలు సున్నితంగా స్పందిస్తారు అని. కానీ, నాకు సమతులాహారం మీద నమ్మకం ఎక్కువ.

గమనిక. తల్లి పాలు పిల్లలకి చాలా పోషకాలను, వ్యాధి నిరోధక శక్తులనూ ఇస్తాయి. కాబట్టి అవే శ్రేయస్కరం. అనుమానం ఉంటే డాక్టరుతో మాట్లాడండి. ప్రత్యేకంగా తల్లి పాల గురించి సలహా ఇవ్వడానికి కూడా  lactation consultants ఉంటారు. అడగండి.  చదవండి. తెలుసుకోండి.  ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి.  

ప్రత్యేకంగా నేనెదుర్కున్న ఇబ్బందుల గురించి ఇంకో టపాలో.

ఇబ్బంది

(కొత్త కథాంశం మీద నేనూ రాశానోచ్! కొన్ని details సరిగా అనిపించకపోతే సూచనలు ఇవ్వ గలరు. ఉదాహరణకి “టాక్సీ” అని రాశాను, generalized గా. నాకు వీటి గురించి అంత పెద్దగా తెలియదు.  అలాగే ఐదుగురే పడ్తారన్నట్టుగా కూడా రాశాను. )

——————————————————————–

 ఇబ్బంది

“పోనీవయ్యా” అన్నాడు ఆ పెద్ద మనిషి.
మాట్లాడకుండా ఇంజను స్టార్టు చేశాడు డ్రైవరు.
పెద్ద ఆఫీసరులా ఉన్నాడు. సూటు తొడుక్కుని చిన్న బ్రీఫ్ కేసు పట్టుకుని హడావిడిగా వచ్చి కూర్చున్న ఆ పెద్ద మనిషి తన సొంత కారులో కూర్చున్నట్టు టాక్సీ డ్రైవరుకి ఆజ్ఞలు జారీ చేస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఆ యువకుడికి. అప్పటికే సీట్లన్నీ నిండాయి కాబట్టి డ్రైవరు కూడా

అసహనంగానే ఉన్నా అనవసర ప్రసంగం లేకుండా టాక్సీ స్టార్టు చేశాడు. 
ఆ యువకుడు తనను చూస్తున్నాడేమో అన్న అనుమానంతో పాటే, తనను గమనించట్లేదేమో అన్న సంశయం కూడా వెంటాడుతుంటే ఆ అమ్మాయి తల్లి చూపులను తప్పించుకుంటూ అతనిని గమనించడానికి తంటాలు పడుతోంది.   అతనేమో అదేమీ తనకు పట్టనట్టే, “ఏమయ్యా, నీ

సొంత కారనుకున్నావా? అలా అదమాయిస్తున్నావు?” అని అడిగాడు. తన ధైర్యానికి ఆ అమ్మాయి ముచ్చట పడాలన్న ఆశ కూడా లేకపోలేదు ఆ సహజమైన చిరాకులో.
“ఏం చెయ్యమంటావు నాయనా, అలవాటులో పొరపాటు మరి. నాకు అవతల కొంపలు మునిగే పనుంది. ఇక్కడేమో మా డ్రైవరు పెళ్ళానికి ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. “నువ్వో ఆటో వెతుక్కో నేను కారులో వెళ్తాను”  అనలేక నేనే ఇంకో వాహనం వెతుక్కుంటూ వచ్చాను. “

అన్నాడు ఆ పెద్ద మనిషి.
తన పొరపాటుకు క్షమాపణ చెప్పుకునే లోపే ఆ యువకుడి సెల్లు మోగడం మొదలు పెట్టింది, సరి కొత్త తెలుగు సినిమాలోని సరసమైన పాట. ఎవరో తిడ్తున్నట్టే కంగారు పడిపోతూ, ఆదరాబదారాగా సెల్లు తీసి వినీ వినపడకుండా ఏదో మాట్లాడేసి పెట్టేసాడు. మొదటి తప్పు కన్నా ఇది

ఇంకా ఘోరంగా అనిపించింది కాబోలు, తల ఎత్తకుండానే గొణుక్కుంటునట్టు చెప్పాడు,  “మా తమ్ముడు నన్ను అల్లరి పెట్టడానికి ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. ఈ  రోజు వాడి పనైపోయింది.”
అదో తమాషాలా అనిపించి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న అమ్మాయిని ఉరిమినట్టు చూసి పెదవి దాటని నవ్వులని కళ్ళ నుండి కూడా తొంగి చూడనివ్వకుండా  తక్షణమే తరిమెయ్యగలిగింది తల్లి. ఆ యువకుడికి ఇబ్బంది ఇంకా ఎక్కువయ్యింది. “రవి కూడా ఆ అమ్మాయి

ఈడు వాడే. వాడే ఆ స్థానంలో ఉండి ఉంటే ఆ పాట వాడే అందుకుని, అప్పటికప్పుడు పేరడీ కట్టి తననే ఆట పట్టించే వాడు. ఆ అమ్మాయి అలా చెయ్యగలదా? తన చెల్లెలే అయితే తను మాత్రం ఊరుకుంటాడా?
అయినా ఏం పని మీద వెళ్తున్నారో తల్లీ కూతుళ్ళు. ఏదో ముఖ్యమైన పనే అయ్యుంటుంది. చక్కగా తయారయ్యారు.”  ఏం చదువుతోందో అడగాలనిపించింది ఆ అమ్మాయిని. ఎందుకులే ఇంత వరకూ జరిగిన పొరపాట్లు చాలవా అని ఊరుకున్నాడు. “పదో తరగతేమో. తన తమ్ముడూ

పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడు. మరి పరిక్షలు దగ్గర్లో పెట్టుకుని తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నట్లో. పెళ్ళికా అంటే మరీ అంత ఆడంబరంగానూ లేరు. ఆ పెద్దాయన అయినా మాట కలపవచ్చు కదా, కాస్త కాలక్షేపమూ అవుతుంది, కుతూహలమూ తీరుతుంది.” ఇలా అనుకుంటూ

ఉండగానే సెల్లు మళ్ళీ మోగింది. మళ్ళీ గబ గబా అందుకుని హడావిడిగా మాట్లాడేసి పెట్టేశాడు.
“బాబూ నచ్చక పోతే ఆ పాట ఇప్పుడైనా మార్చెయ్యచ్చు కదా?” అనడిగాడు పక్కన ఉన్నతను. ఇప్పటి దాకా అతనిని గమనించినట్లే లేదు, ఆ యువకుడు ఉలిక్కిపడ్డాడు.  అంతలోనే నవ్వుతూ, “అవును కదా, నాకు తోచనే లేదు చూడండి”, అంటూ అప్పటికప్పుడు రింగు టోను

మార్చేశాడు. “ఏం చదువుతుంటావు బాబూ?” అని అడిగాడు మళ్ళీ అతనే. చూస్తుంటే పల్లెటూరినుంచి వచ్చినట్టున్నాడు. ఎరువుల గోతంతో కుట్టిన సంచీ నిండా ఏవో వస్తువులూ, కొడవలి ఒకటి బయటకు కనిపిస్తోంది.   “ఇంజనీరింగు ఆఖరు సంవత్సరం”, అని చెప్పాడు. అలా

సంచీలోంచి తొంగి చూస్తున్న కొడవలి చూస్తుంటే అనుకోకుండా పాట బయటికి వచ్చింది, “మదనా సుందారి, మదన సుందారి, నడుమున కొడవళ్ళ కొసలు మెరవంగ…”  అందరూ నవ్వేశారు, తల్లి కూడా. “మీరు బాగా పాడతారు సార్” అన్నాడు డ్రైవరు. ఇప్పుడా యువకుడికి ఆ అమ్మాయి పరిస్థితి కన్నా తన పరిస్థితే ఇబ్బందికరంగా అనిపించ సాగింది. 

అనిపిస్తుంటుందొక్కోసారి

మంచితనం కంటే ఒంటరితనం లేదు అని

చదువు చదివాను

కొడవటిగంటి కుటుంబరావు గారి “చదువు” చదివాను. నా స్వంత చదువును ప్రశ్నించుకున్నాను. మనం నేర్పే చదువును గురించిన ఆలోచనలు కూడా ఎన్నో ప్రశ్నలతో సాగుతూనే ఉంటాయనుకోండి.

అయితే నా భావాలను (పుస్తకం మీద అభిప్రాయాలు ఇంకా ఏర్పర్చుకునే స్థితిలో లేను) రాయకన్నా ముందు కొన్ని ప్రశ్నలు. దయ చేసి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించ గలరు.

1. చదువులో, అసమర్థుని జీవిత యాత్రలో నాయకుల మధ్య పోలికలు ఎవరికైనా కనిపించాయా?
2. ఈ నవల ఉద్దేశ్యం లేదా సందేశం ఏమని అర్థం అయ్యింది? (ఒక్కొక్కరికీ ఒక్కోలాగా అనిపిస్తుందని నమ్ముతూ అడుగుతున్నాను). 
 
ఇక ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ నాకు నేను కనిపిస్తూ వచ్చాను. ఎన్నో పోలికలున్నాయి ప్రధాన పాత్రతో నాకు - చదవడం నేర్చుకున్న విధానం నుంచీ స్వాతాంత్ర్య పోరాటం మీద అభిప్రాయాల వరకూ. కథ ఎలా ముగుస్తుందోనని ఎంత అనుమానం వెంటాడుతూనే ఉన్నా, ప్రధాన పాత్రతో పోల్చుకోగలిగేలా ఉండడం కించిత్తు గర్వంగా అనిపిస్తూ ఉండాలి కూడాను.

అంతా చదివాక దాదాపు ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ఆగిపోయాను. బహుశా కథ ఉద్దేశం కూడా అదేనేమో. అప్పుడొక సినిమా చూశాను. పేరు గుర్తు లేదు. ఒకే రోజు మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంటుంది. నాయకుడికి తప్ప ఇంకెవరికీ క్రితం సారి జరిగినవి గుర్తుండవు. అప్పుడు నాయకుడు క్రితం రోజు చేసిన తప్పులను దిద్దుకుంటూ, ప్రతి రోజూ మెరుగయ్యి విజయం సాధిస్తాడు అనుకుంటా. ప్రతి తరంలోనూ తల్లిదండ్రులు చెయ్యాలనుకునేది అదేనేమో అనిపిస్తుంటుంది నాకు. 

ఇక నాకు నా అనుభవంలోనూ, ఈ కథలోనూ కొట్టొచ్చినట్టు కనిపించిన అంశాలు, నేను address చెయ్య దల్చుకున్న విషయాలు ఇవి. కాలేజీ చదువులు, ముఖ్యంగా ఖరీదైన కోర్సులు చదవ దల్చుకున్న విద్యార్థులు ఆర్థికావసరాల కోసం కాస్త వళ్ళు వంచి కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించుకోవడం అనే ఒక choice ఉందని తెలుసుకోవాలి, బాధ్యత గల వాళ్ళు వారికి ఆ విషయం గురించి అవగాహన ఇవ్వ గలగాలి. ఈ కథలో కూడా సుందరం ఒక టర్మ్ ఫీజుతో ఆగ్రా చుట్టి రావడం చదివితే నాకు బాధ వేసింది. కొత్త వాతావరణంలోకి వెళ్ళగానే సుందరం ధ్యాస చదువు మీద నుండి జీవితం మీదకి మళ్ళింది అన్న మాటలు కూడా కాలేజీ వయసు పిల్లల గురించి తెలుసుకోవడానికి పెద్దలకు ఉపయోగపడాలి అనిపిస్తుంది. 

సమాజంలో అన్యాయాలూ ఉంటాయి, వాటిని ఎదిరించే వాళ్ళూ ఉంటారు. మంచైనా, చెడైనా ఒక ప్రయోజనాన్ని సాధించడానికి మనుషుల (బలగం) అవసరమౌతుంది.  సుందరం లాగా observe చేసే వాళ్ళ కోవలోకి నేనూ చేరుతాననిపిస్తుంది. ఏదో ఒక ప్రభావానికి లోనయ్యి ముందుకు వెళ్ళే వారూ, అది “మంచి” ప్రయోజనమే అయినా పూర్తి స్థాయిలో పాల్గొనడానికి “జీవితం”, జీవితానికి అలాంటి ఉద్యమం, ఎదురు నిలుస్తాయి అన్నది సత్యం. ఎంపిక ఒక్క మెట్టు మాత్రమే. జీవితంలో లక్ష్యాలను ఎంచుకున్నా, ఎంచుకోక పోయినా జీవిత ప్రయాణం సుగమం కాదు. మన జీవితం పూర్తిగా మన బాధ్యతే.  మన వారి జీవితం కూడా మన బాధ్యతలో భాగం. ఎందుకంటే ఏది అనుభవించాలన్నా మన వారు కావాలి కదా.

ఎవ్వరినీ దేనికీ బలవంతం చెయ్యలేము. ఏ మార్పూ దానంతట అదే మంచి చెయ్య లేదు. జీవితం చాలా క్లిష్టమైనది. జీవించడం అనేది ఒక పెద్ద బాధ్యత.

తరువాతి కాగితం »